- అపోలో ఆసుపత్రి సహకారంతో ఐఎంఏ ఆధ్వర్యంలో నిర్వహణ
- వెన్నెముక, రక్తనాళాల శస్త్రచికిత్సలపై ప్రముఖ వైద్యుల అవగాహన
నంద్యాల, జూన్ 24 (డిగ్నిటి న్యూస్): నంద్యాల ఐఎంఏ ఆధ్వర్యంలో, హైదరాబాద్ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ అపోలో ఆసుపత్రి సహకారంతో స్థానిక మధుమణి ఆసుపత్రి సమావేశ భవనంలో నంద్యాల ప్రాంత వైద్యులకు నిరంతర వైద్య విద్య సదస్సును ఘనంగా నిర్వహించారు. నంద్యాల ఐఎంఏ అధ్యక్షులు డాక్టర్ శ్రీనివాస్ అధ్యక్షతన, కార్యదర్శి డాక్టర్ మహమ్మద్ రఫీ నిర్వహణలో జరిగిన ఈ కార్యక్రమానికి ఐఎంఏ జాతీయ కేంద్ర కమిటీ సభ్యులు, మాజీ ఐఎంఏ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ రవి కృష్ణ ముఖ్యఅతిథిగా హాజరై సదస్సును ప్రారంభించారు.
ఈ సందర్భంగా డాక్టర్ రవి కృష్ణ మాట్లాడుతూ, వైద్యులు ప్రాక్టీస్ చేసినంత కాలం తమ వైద్య పరిజ్ఞానాన్ని నిరంతరం పెంచుకుంటూ ఉండాలని పిలుపునిచ్చారు. తద్వారా నూతన వైద్య విధానాలు, ఆధునిక పరికరాలపై అవగాహన పెరిగి, ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందించడానికి ఆస్కారం ఏర్పడుతుందన్నారు.ఈ సదస్సులో హైదరాబాద్ అపోలో ఆసుపత్రి న్యూరో సర్జన్ డాక్టర్ శ్రీకాంత్ రెడ్డి, వాస్క్యులర్ సర్జన్ డాక్టర్ రాహుల్ లక్ష్మీనారాయనన్ ముఖ్య వక్తలుగా పాల్గొని మల్టీమీడియా ప్రజెంటేషన్ ద్వారా ప్రసంగించారు. డాక్టర్ శ్రీకాంత్ రెడ్డి వెన్నెముక శస్త్ర చికిత్సల్లో వస్తున్న నూతన విధానాలపై స్థానిక వైద్యులకు అవగాహన కల్పించగా, డాక్టర్ రాహుల్ లక్ష్మీనారాయనన్ మాట్లాడుతూ కాలు రక్తనాళాలలో రక్త సరఫరా సమస్యలు తలెత్తినప్పుడు అనుసరించాల్సిన ఆధునిక శస్త్ర చికిత్స విధానాలను సవివరంగా వివరించారు. ఈ సదస్సులో ఐఎంఏ రాష్ట్ర వర్కింగ్ కమిటీ సభ్యులు డాక్టర్ మధుసూదన రెడ్డి, ఐఎంఏ నంద్యాల మాజీ అధ్యక్షులు డాక్టర్ మధుసూదన రావు, రాష్ట్ర ఐఎంఏ మాజీ ఉపాధ్యక్షులు డాక్టర్ విజయభాస్కర్ రెడ్డి, డాక్టర్ అనిల్ కుమార్, అపోలో ఆసుపత్రి ప్రతినిధి రమణతో పాటు నంద్యాల ప్రాంతానికి చెందిన వైద్యులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
